mt_logo

యుద్ధప్రాతిపదికన వెంటనే రోడ్ల రిపేర్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి
  • ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదు
  • కేసీఆర్ ఆర్ అండ్ బి పునర్వ్యస్థీకరణ లో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు
  • డి.ఈ నుంచి ఆ పై స్థాయి అధికారి వరకు ప్రత్యేకంగా నిధులు అందుబాటులో ఉంచారు
  • -రోడ్లు భవనాలు శాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

హైదరాబాద్: అధిక వర్షాలు,వరదల వల్ల పాడైన ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు…డా. బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని మంత్రి ఛాంబర్ లో ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారికి సైతం పరిపాలన అనుమతుల అధికారం కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆర్ అండ్ బి శాఖ పునర్వ్యస్థీకరణ లో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా డి.ఈ నుంచి ఆ పై స్థాయి అధికారి వరకు ప్రత్యేకంగా నిధులు అందుబాటులో ఉంచామని అన్నారు. డి.ఈ స్థాయి అధికారి కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణం రోడ్డు మరమ్మత్తు కోసం నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. డి.ఈ 2లక్షలు,ఈ.ఈ 25 లక్షలు, ఎస్.ఈ 50 లక్షలు,సి.ఈ 1 కోటి,ఈఎన్సీ 20 కోట్ల వరకు రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టారని అన్నారు. దాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. యుద్ధప్రాతిపదికన అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.