mt_logo

వీఆర్ఏ క్రమబద్దీకరణ: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్: VRA లను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయం పై కేబినేట్ లో నిర్ణయం తీసుకున్న అనంతరం VRA జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్ కు ఆహ్వానించి సీఎం వారితో చర్చించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్ పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. ఈ విషయంలో వీఆర్ఏ లు సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, VRA జెఎసి ప్రతినిధులకు సూచించారు. వీఆర్ఏ వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.

కేబినేట్ లో నిర్ణయం తీసుకొని తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీఆర్ఏ, జెఎసి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.