
ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది. 2 కిలోమీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత జరుగతుంది.
ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు.
ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు గ్రామ సర్పంచులు, ప్రజలు అభిషేకం చేయనున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.
దక్షిణ తెలంగాణకు ఆరోజు ఒక పండుగ రోజుగా నిలవనుందని.. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని… పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సీఎం ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నది.. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది అని సీఎం కేసీఆర్ తెలిపారు.