mt_logo

రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు నీటి మీద రాతలే అని తేలిపోయింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ. 7,500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు భరోసా ఉన్నట్లా..లేనట్లా. ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి, విధానాల రూపకల్పన మీద ఉండదా అని దుయ్యబట్టారు.

ఏడు నెలల నుండి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరిక లేదా.. ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

డిసెంబరు 9న రూ. 15 వేల రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాతలే అని తేలిపోయింది. ఇప్పుడు రైతుభరోసాకు విధి, విధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎందుకు రైతుభరోసాను పరిమితం చేస్తామని, సమీక్ష చేస్తామని చెప్పలేదు అని అడిగారు.

రైతు భరోసాకు దిక్కు లేదు. కౌలు రైతుల ఊసులేదు. రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడు. వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలి ఆని నిరంజన్ రెడ్డి అన్నారు.

కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతున్నది. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతుభరోసాపై తీర్మానం చేయాలి. రైతు బీమా ఉంచుతారా.. ఎత్తేస్తారా.. తేల్చి చెప్పాలి. రైతు కూలీలకు రూ.12,000, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలి అని డిమాండ్ చేశారు.

అబద్దపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి అని కోరారు.