mt_logo

అరుదైన వ్యాధి ఉన్న మూడేళ్ల బాబుకు కేటీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం

తమ మూడేళ్ల బాబుకు అరుదైన వ్యాధి కారణంగా వైద్యానికి డబ్బులు లేక ఆవేదనలో ఉన్న కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తితో ఆ కుటుంబానికి సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో సోమవారం కేటీఆర్ చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందించారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం, తిమ్మంపేట్ గ్రామానికి చెందిన కుంబోజు మహేశ్వర్, అలేఖ్య దంపతులకు మాధవన్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. ఆ బాబుకు గౌచర్ అనే అరుదైన వ్యాధి ఉండటంతో వైద్యానికి భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మధ్యతరగతి కుటుంబం కావటంతో వైద్యానికి సాయం అందించాలని ఆ కుటుంబం దాతలను కోరింది. ఆ కుటుంబ పరిస్థితిని ఈనాడు పేపర్ లో వచ్చిన కథనం ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

కేటీఆర్ చేతుల మీదుగా మాజీ మంత్రి రాజయ్య ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ పోచంపల్లిని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. తమ బాబు వైద్యానికి సాయం అందించిన పోచంపల్లికి బాబు తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు