- మా పార్టీ లీగల్ టీం సలహాలతో ముందుకెళ్తాం
- రాజకీయ కక్షతోనే నోటీసులు
- టీవీ సీరియల్లా ఏడాది నుంచి సాగదీస్తున్నారు
- కేసీఆర్కి వస్తున్న ఆదరణకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి
- -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్: తనకు మోడీ నోటీసు వచ్చిందని, కానీ రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ వ్యవహారంపై పెద్దగా ఆలోచించవద్దని, గత ఏడాది కాలంగా టీవీ సీరియల్లాగా సాగదీస్తున్నారని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 2జీ కేసు కూడా ఇంత కాలం సాగలేదని, కేవలం రాజకీయ దురుద్ధేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ఇదే తీరుతో వ్యవహరించడం బీజేపీ విధానమని విమర్శించారు.
సీఎం కేసీఆర్కి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బిజెపి పార్టీలు భయపడుతున్నాయని, తెలంగాణలో మరో సారి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. దేశ ప్రజలు కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాబట్టి రకరకాల ఆరోపణలు వస్తాయని, కానీ తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తేల్చి చెప్పారు.