mt_logo

కేసీఆర్‌కే ఓటేసి గెలిపిస్తామని 10 గ్రామ పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

  • కామారెడ్డి లో కేసీఆర్‌కు బ్రహ్మరథం
  • ఈనెల 28న కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో భారీ సమావేశం
  • సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు.

శనివారం రోజు మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…  ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. 

ఆ నిర్ణయం వల్ల రెండు నియోజకవర్గాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడం వల్ల కేవలం కామారెడ్డి జిల్లాకే కాకుండా ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.

ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతం

నిజామాబాద్ బిడ్డగా సీఎం కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేయడానికి తాను స్వాగతిస్తున్నానని, అందరిలానే తనకు కూడా ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు.

కారుకు ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా ఈ 10 గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారని, ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్ ను ఆహ్వానించారని వివరించారు. 

 సీఎం కేసీఆర్ పార్టీలకు , కులాలకు,  మతాలకు అతీతం

పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్ ను పార్టీలకు, కులాలకు,  మతాలకు అతీతంగానే చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డి లోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ బోలా శంకరుడు అని, ఆయనకు ఆయన చేతికి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

కామారెడ్డి ప్రజలు పౌరుషాన్ని చూపించే సమయం

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. ఎన్నికలు కాబట్టి పోటీ ఉన్నా లేకున్నా పని చేసుకుంటూ వెళ్లాలని, ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరించాలని నాయకులకు కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి ప్రజలు పౌరుషాన్ని చూపించడానికి ఇది సమయం అని తెలిపారు. గజ్వేల్ కన్నా ఒక్క ఓటు అన్న ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపించాలని అన్నారు. 

కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు

అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు కవిత అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని  ప్రశంసిస్తున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు సైతం ఇస్తున్నాయని తెలిపారు. గ్రామాలు పట్టణాలు బాగుండాలన్న కేసీఆర్ పట్టుదల తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి అని వివరించారు. కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.