mt_logo

తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు.. మంత్రి హరీష్ రావు

సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచలో  నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 

నియోజకవర్గంలో ఫార్మసీ కాలేజ్ శంకుస్థాపనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకుని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమని అన్నారు. విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట. అన్ని రకాల చదువులతో  ఈరోజు సిద్దిపేట జిల్లా విరాజిల్లుతోందని స్పష్టం చేశారు.  మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయి.

డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెం.1

సిద్దిపేట ఒకటే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ప్రతి గ్రామం తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాయని గుర్తు చేశారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెం.1 గా ఉంది.

ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్‌వన్‌

ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదారాబాద్‌లో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా పెరిగింది. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది.

నాడు  3 లక్షల ఐటీ ఉద్యోగాలు నేడు 10 లక్షల ఐటీ ఉద్యోగాలు 

తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఈరోజు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఎలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయో అదే విధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ  ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో  కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారు. దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధిలో సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిచే అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తాం. హైదారాబాద్‌లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటినుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ఎంతో మందికి విద్యను ఉపాధిని కల్పిస్తుంది ఎగ్జిబిషన్స్ సొసైటీ.