- కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు
- కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం
- బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
- – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/10/Untitled-Project-21-7.jpg?resize=1024%2C576&ssl=1)
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమం మీద బుధవారం తన బంధువుల ఇంటికి రాగా స్థానిక మీడియా ప్రతినిధులు ఆయనతో ముచ్చటించారు. తన తల్లి మరణానంతరం మొదటి సారి బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ మేనిఫెస్టో పై ఆయన స్పందించారు.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. కేసిఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఎప్పుడో ఖాయమయ్యిందని అన్నారు. అస్తవ్యస్తమైన కరెంట్ తో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సుమారు లక్ష కోట్లతో కరెంట్ వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు. నేడు తెలంగాణలో రైతులు తన పక్క పొలం రైతుతో దిగుబడిలో పోటీపడుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ బాగు కోసం తాపత్రయ పడుతుంటే బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం అడ్డమైన నిరాధార ఆరోపణలు చేస్తూ కేసీఆర్ని విమర్శించే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసిఆర్ ఒక వైపు ఉంటే..ఓటుకు నోటు కేసులో పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు ఉన్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులని వారికి మంచి చేసే వారు ఎవరూ.. అధికారం కోసం మోసపు హామీలతో వచ్చే వారెవరో బాగా తెలుసన్నారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చెప్పింది చేస్తాడని ప్రజలకు నమ్మకముందని కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్,రైతు బంధు,బీమా లాంటి ఎన్నో మానవీయ కోణ పథకాలు ఆయన హామీ ఇవ్వకుండానే పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కేసిఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
బోధన్లో ఎమ్మెల్యే షకీల్ విజయం ఖాయం అయ్యిందనీ మొన్నటి వరకు 25 వేల మెజార్టీ వస్తుందని అనుకున్నాం కానీ కేసీఆర్ మేనిఫెస్టో తర్వాత 50 వేల మెజారిటీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. విజయం ఖాయం అయింది కానీ మెజార్టీ తేలాల్సి ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ మంత్రి వేముల మరోమారు స్పష్టం చేశారు.