mt_logo

గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది : మంత్రి సత్యవతి రాథోడ్

  • పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
  • గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
  • సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం
  • గిరిజన రిజర్వేషన్ 10% పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా గిరిపుత్రుల‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమ‌లు చేస్తున్నారన్నారని, ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా  గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ఆదివాసుల‌కు అన్ని మౌళికవసతులు కల్పించడానికి రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తుంద‌ని వెల్లడించారు.

ప్రతి తండానూ గ్రామ పంచాయతీ గా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలన అధికారి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు. అంతే కాకుండా గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులను సీఎం కేసీఆర్ గారు వారిని ఆ భూములకు యజమానులు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల 6 వేల 369 ఎకరాలకు గాను 1లక్ష 51వేల 146 పోడు రైతులకు పట్టాలను అందజేయడం జరిగింది. అంతే కాకుండా అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం జయంతిని అధికారికంగా ఘనంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బంజారాహిల్స్ లో  25 కోట్లతో కొమురం భీమ్ ఆదివాసి భవన్ లను నిర్మించుకున్నామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 32 ఆదివాసీ భవన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది అని తెలిపారు. కేస్లాపూర్‌లోని నాగోబా జాతర, కొమురం భీం, జంగు భాయ్ వంటి అనేక ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా మరో సారి  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.