mt_logo

ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయం: మంత్రి కేటీఆర్

ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకు పైగా గెలుస్తాం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆరే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పది సంవత్సరాల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని స్పష్టం చేశారు. 

ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమే.. 

ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని ఎద్దేవా చేసారు. కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష. ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమే అని అన్నారు. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయన్నారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని తెలిపారు. 

ఇది మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి 

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. 65 సంవత్సరాలలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు ,కేవలం రెండు మెడికల్ కాలేజీలే అని గుర్తు చేసారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదని మండి పడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆరే, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితని సూచించారు. 

మారణహోమం సృష్టించిన పార్టీ కాంగ్రెస్

ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మారణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్,  తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు, ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని స్పష్టం చేశారు. 

బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు జాగ్రత్త 

తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలన్నారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు, తెలంగాణ ఈరోజు వారు కాంగ్రెస్ ని గెలిపిస్తారంట!! తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారని అన్నారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి…కేవీపీ రామచందర్రావు… షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు… బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి

పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాలన్నారు. పైకి కనబడేది కిషన్ రెడ్డి అందించేది  కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ అని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని పేర్కొన్నారు.

సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రం 

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా…? ఒక్కరన్నా రాజీనామా చేశారు…? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుందన్నారు.  భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుందన్నారు. నల్ల చట్టాలు తెచ్చినా బీజేపీ కావాలా లేదా జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా? అని అడిగారు.  ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టమన్నారు. 

ఈ ప్రాజెక్టును స్వాగతించాలి..  

తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు ఇటు బీజేపీ అడగదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందా చెప్పాలన్నారు. 55 సంవత్సరాలలో 200 దాటి పెన్షన్ ఇవ్వని  వారు.. నాలుగు వేలు ఇస్తాము అంటే ఎట్లా నమ్ముతారని ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి  చెప్పిన, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర తెలుసన్నారు. పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈరోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి. 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎస్పీ కాలువను నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదని అడిగారు. మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును స్వాగతించాలన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయి,  తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల జిమ్మికుని తీసుకువచ్చింది అని అభిప్రాయపడ్డారు. ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి అని గుర్తు చేసారు. ఇప్పుడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితామని కలలు కంటే ఎవరు పట్టించుకుంటారన్నారు. 

అందుకే బీజేపీని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు.. 

 దేశంలో మోడీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవగాహనలో ఉన్నాయి, అందుకే బీజేపీని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించరన్నారు. మా నాయకుల పైన దాడులు చేసిన ఈడి దాడులు చేసినవి…ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసినాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపైన మాట్లాడడానికి ఏం లేదన్నారు. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది వారి తలనొప్పి… మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.