mt_logo

దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు: మంత్రి హరీష్ రావు

జనగామ జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వల్మీడిలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదృష్టవంతుడని అన్నారు. వాల్మీకి పుట్టిన ఊరు వాల్మీకిపురం కాలక్రమేణా వల్మీడిగా మారింది. ఇక్కడే ఆదికావ్యం రామాయణాన్ని వాల్మీకి మునుల గుట్ట మీద రాశారు అని ప్రతీతి అని గుర్తు చేసారు.

శ్రీ రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఇక్కడి రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేసేలా ముందుకు వెళ్తాం అన్నారు. గుండెల నిండా భక్తి భావాన్ని కలిగిన వారు మన సీఎం కేసీఆర్ అని అన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాలు నిర్మించడమే కాదు.. నిర్మించిన అన్ని దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలు కార్యక్రమం జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3700 దేవాలయాలకు దూప దీప నైవేద్యాల కింద నిధులు కేటాయిస్తున్నాం అని తెలియజేసారు. కొత్తగా చేర్చే దేవాలయాలతో ఆ సంఖ్య 7 వేలకు పైగా దాటింది. దీప ధూప నైవేద్యాలు కోసం ఇచ్చే రూ. 6 వేలను రూ. 10 వేలు చేశారు.

ఆధ్యాత్మిక భావనతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి నమ్ముతారు.. యాగాలు చేస్తారు. అందుకే 10 ఏళ్లుగా మంచి వర్షాలు పడ్డాయి.. కరువు కాటకాలు రాలేదన్నారు. పరిపాలకులు దేవుడికి సేవ చేస్తే కృప ఉంటుంది. యాదాద్రి, కొండ గట్టు, భద్రాద్రి, కాళేశ్వరం ఆలయాలు సహా అనేక ఆలయాలు నిర్మిస్తున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంచడంతో పాటు దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు.

మా కేబినెట్‌లోనే అత్యధిక అవార్డులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాఖకు వచ్చాయని తెలిపారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38 శాతం అవార్డులు వచ్చాయి. ఉత్తమ గ్రామాలు, జిల్లాలుగా తెలంగాణకే అన్ని అవార్డులు వచ్చాయన్నారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నాం అని గుర్తు చేసారు. మిషన్ భగీరథకు రాని అవార్డు లేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. హెలికాప్టర్ లో వస్తుంటే ఈ ప్రాంతం పంటలతో పచ్చగా.. చెక్ డ్యాంలన్నీ నీళ్లు నిండి ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతో కష్టపడతారని తెలిపారు.