mt_logo

నగరం నడిబొడ్డున ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

నగరం నడిబొడ్డున మీడియా అకాడమీకి చాపల్ రోడ్డు,నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో  29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు . ఈ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని, మీడియా అకాడమీ చైర్మన్,అల్లం నారాయణ  విజ్ఞప్తి చేశారు. ఆయన ఆమోదం కోసం చూస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాత అకాడమీ భవనం లో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారు.  ఆ మేరకు  2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కర్త, కర్మ, క్రియ గా ఈ భవనం రూపుదిద్దుకున్నది. భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు నిర్మించారు.

 తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ  ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది.

ఇటీవల నిర్మాణం పూర్తయిన సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి తదితర అధికారులు అకాడమీ భవన నిర్మాణం పర్యవేక్షించారు. భవనం పనులన్నీ తుదిదశకు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దవలసిందిగా ఆర్ అండ్ బి అధికారులను కోరారు. త్వరలో అకాడమీకి కార్పొరేట్ స్థాయి  సొంత భవనం సిద్ధమయింది.

కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్, అశోక్ రెడ్డి ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని అకాడమీ చైర్మన్ తెలిపారు.