mt_logo

స్వాతంత్య్ర దినోత్సవ వేళ రైతులకు రుణ మాఫీ

  • తెలంగాణ రైతాంగానికి తీపికబురు చెప్పిన ప్రభుత్వం 
  • 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ..
  • ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లో రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ

రాష్ట్ర రైతాంగానికి మరో తీపికబురు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను.. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌   రావుగారు రైతు రుణ మాఫీ పథకాన్ని  ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  .. ఈ మేరకు ఈ రోజు 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారికి సోమవారం ఆదేశాలు జారీచేశారు. 

సోమవారం రూ.5809.78 కోట్లు విడుదల 

రైతుల తరపున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ఇచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018 లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ కి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. అయితే, అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌  డౌన్‌   ఉండడం, మన దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. 

45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి

అయినప్పటికీ ఇప్పటికే 50 వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించిన 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకుంది. తాజాగా 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బీఆర్‌వో) కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆగస్టు 3వ తేదీ నుంచి రుణమాఫీ కి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌  గారి ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి.. ఇచ్చిన మాట ప్రకారం, 99 వేల 999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు లబ్ధి చేకూరినట్లవుతుంది.

45 రోజుల కార్యాచరణ..

రైతుల రుణమాఫీ గురించి ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ప్రకటించిన మరుక్షణం నుంచే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లు సీఎం ఆదేశాలకు అనుగుణంగా 45 రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రోజువారీగా సమీక్షలు చేస్తూ బ్యాంకులతో మాట్లాడుతూ..  రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 3వ తేదీ నాడు 41 వేల లోపు రుణాలున్న 62వేల 758 మంది రైతులకు సంబంధించి 237 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేశారు. అలాగే, ఆగస్టు 4వ తేదీన 43 వేల లోపు రుణాలున్న 31వేల 339 మంది రైతులకు సంబంధించి 126 కోట్ల 50 లక్షల రుణాలను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తర్వాత తాజాగా 99 వేల 999 రూపాయల వరకు ఉన్న రుణ మొత్తాలను జమ చేస్తున్నది. 99 వేల 999 రూపాయల వరకు అప్పున్న రైతుల సంఖ్య 9లక్షల 2 వేల 843 ఉన్నది. వీరికి సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనున్నది.  దీంతో 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు రూ.7753 కోట్ల 43 లక్షల రూపాయలను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించినట్లవుతుంది.

రైతు రాజ్యం..

తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యమని మరోసారి నిరూపితమయ్యింది. దేశంలో ఎక్కడలేని విధంగా సాగునీటి వసతులు కల్పించిన విషయం తెల్సిందే. మిషన్‌   కాకతీయ పేరుతో 35వేల చెరువులను బాగు చేయడంతోపాటు కాళేశ్వరం వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు కట్టి సాగునీటి రంగంలో అద్భుతం సృష్టించింది. రైతులకు సకాలంలో ఎరువులను అందుబాటులో పెట్టడం, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాల బెడద రైతులకు రాకుండా నకిలీ విత్తనాల తయారీ, సరఫరా దారులపై పీడీ చట్టం ప్రయోగించి వారిని జైళ్లకు పంపడం, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, రైతులకు మార్కెటింగ్‌   సౌకర్యాలు కల్పించడం.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో అద్భుతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌  , తెలంగాణ సర్కారు రైతుల చేపట్టిన విషయం తెల్సిందే. 

35 లక్షల 32 వేల మంది రైతులకు నేరుగా లబ్ధి 

2014 నాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి వరకు బ్యాంకులకు రైతులు బకాయిపడ్డ రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌  తీసుకున్న ఈ నిర్ణయంతో 35 లక్షల 32వేల మంది రైతులకు నేరుగా లబ్ది చేకూరింది. ప్రభుత్వం అక్షరాల 16వేల 144 కోట్లను వెచ్చించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండానే ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి రైతులను రుణ విముక్తులను చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన విధంగానే 2018 లో అధికారంలోకి వస్తే కూడా రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌   ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రైతు రుణమాఫీ చేస్తున్నారు. నేటి వరకు 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు సంబంధించి 7753 కోట్ల 43 లక్షల రుణాలను మాఫీ చేసింది.

రైతు బీమా..

దుఃఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ కారణంగానైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని

ప్రతి రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇప్పటి వరకు మరణించిన రైతులకు సంబంధించి లక్ష 8051 మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 5,402.55కోట్లను పరిహారం గా అందించింది. రైతు మరణించిన కేవలం 15 రోజుల్లోనే బీమా సొమ్ము రైతులకు అందేలా ఏర్పాట్లు చేసింది. ఇది దేశంలోని మరే రాష్ట్రంలో లేదు.

ఉచిత విద్యుత్..

దేశంలో రైతులకు 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో 27 లక్షల 49వేల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఉచిత విద్యుత్ అందించేందుకు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 96 వేల 288 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం అక్షరాల 32వేల 700 కోట్లను ఖర్చు చేసింది. కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్ రంగంపై ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు.

రైతు బంధు

దేశ రైతాంగ చరిత్రలోనే రైతు బంధు అతి గొప్ప సంస్కరణ. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా పథకాన్ని రూపొందించారు. ఎకరానికి సాలీనా 10 వేల చొప్పున ఇప్పటి  వరకు గడిచిన 11 విడతల్లో  కలిపి 71వేల 552 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ సంవత్సరం రైతు బంధు అందుకునే రైతుల సంఖ్య పెరుగుతున్నది. ఈసారి కొత్తగా పోడుపట్టాలున్నరైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా వర్తింప చేశారు. దీంతో లక్ష 51వేల 469 మంది గిరిజన రైతులకు 4 లక్షల 6 వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ. రెండు వందల కోట్లను విడుదల చేసింది. ఇది ఈ సీజన్‌  కు మాత్రమే. ఏడాదికి రూ.నాలుగు వందల కోట్లను కేవలం పోడు రైతులకు రైతుబంధు కింద అందించనున్నారు.