mt_logo

పెన్షన్ డబ్బు తిరిగి కట్టమని వృద్ధురాలికి నోటీసు పంపడం దుర్మార్గం: కేటీఆర్

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఫైర్ అయ్యారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది అని దుయ్యబట్టారు.

ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు అని పేర్కొన్నారు.

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి.. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు అని కేటీఆర్ హెచ్చరించారు.