mt_logo

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్

రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌కి కట్టుబడి ఉన్నామని చెప్తున్న రాహుల్ గాంధీ, ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన న్యాయపత్ర (మేనిఫెస్టోకి) విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే, ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి తాము హామీ ఇచ్చిన పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తాం అన్న మానిఫెస్టో అంశం పైన చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీలో చేరిన అర డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫాంలో పైన పోటీ చేసిన అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. వీటన్నిటి పైన మౌనంగా ఉంటున్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి అమలుపైన రాహుల్ చిత్తశుద్ధిని కేటీఆర్ ప్రశ్నించారు.