mt_logo

10 నెలల్లో రేవంత్ చేసిన రూ. 80,500 కోట్లు అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు రూ. 80,500 కోట్లకు చేరాయని.. 10 నెలల్లో రూ. 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని మండిపడ్డారు.

అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు.. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? రూ. 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు? అని ప్రశ్నించారు.

బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి.. అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి? అని అడిగారు.

బీఆర్ఎస్ హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం.. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం అని గుర్తు చేశారు.

కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల ‘అడ్రస్’ ఎక్కడ? రుణమాఫీ చేయకుండా.. రైతుభరోసా వేయకుండా.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా.. ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని విమర్శించారు.

రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా.. సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని కేటీఆర్ ఆక్షేపించారు.