mt_logo

తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: కేటీఆర్

తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం అని అన్నారు.

తలాపున గోదారి గలగల పారుతున్న.. తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని అన్నారు.

దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్‌కు పునరుజ్జీవమిచ్చిన
పుణ్య వరం కాళేశ్వరం. నీళ్లు రాక.. ఒట్టిపోయిన నిజాంసాగర్‌కు నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం అని తెలిపారు.

మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం. మా తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదు.. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం, దాన్ని సరిదిద్దుకోగలం. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం అని అభిప్రాయపడ్డారు.