mt_logo

ప్రభుత్వ హాస్టళ్ళలో కలుషిత ఆహారం.. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు: కేటీఆర్

మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు అని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి.. బల్లిపడిన టిఫిన్లు.. చిట్టెలుకలు తిరిగే చట్నీలు అని విమర్శించారు.

మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి.. 20 మంది విద్యార్థులకు వాంతులు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు.

కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ.. ఈ అస్వస్థత అని అన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. లేకపోతే భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం జరుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.