mt_logo

రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు మరణ శాసనాలయ్యాయి: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ విధానాలు సరిగ్గా లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం గారు.. ఊరించి, ఊరించి ఏడు నెలలు ఏమార్చి చేసిన మీ రుణమాఫీ తీరు చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే.. చారాణ కోడికి బారాణ మసాలా అని విమర్శించారు.

రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలైనై అని దుయ్యబట్టారు.

అన్నివిధాలా అర్హత ఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు. అర్హులైన లబ్ధిదారులు రుణమాఫీ కాక.. అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా.. ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా అని ప్రశ్నించారు.

రెండు సీజన్లు అయినా.. రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే. జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే. కౌలు రైతులకు ఇస్తానన్న రూ. 15 వేలు ఇయ్యనే ఇయ్యలే.. రైతు కూలీలకు రూ. 12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మభ్యపెట్టే మీ పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని ఎద్దేవా చేశారు.