mt_logo

సీఎంఎస్టీఈఐ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి గిరిజనులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి: కేటీఆర్

హైదరాబాద్‌లో సీఎంఎస్టీఈఐ (CMSTEI) పథకంలో భాగంగా రాకేష్, మురళీ అనే యువకులు స్థాపించిన డ్రాపిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డ్రాపిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉంది. ఈ సంస్థ యాజమానులు రాకేష్, మురళీలు జాబ్ కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాన్ని ప్రారంభించటం మంచి విషయం అని అన్నారు.

సీఎంఎస్టీఈఐ (చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంట్రపెన్యూర్ అండ్ ఇన్నోవేషన్) పథకంలో భాగంగా వందలాది గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు కేసీఆర్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు.. వారికి అన్ని విధాలుగా సహకారం అందేందుకు ఐఎస్బీతో ట్రైనింగ్ ఇప్పించాం. ప్రభుత్వం ద్వారా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సహకరించాం అని తెలిపారు.

డ్రాపిట్ లాండ్రీ సర్వీస్‌ను మరింత విస్తరిస్తామని పిల్లలు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది.. ఇదే కదా మా ప్రభుత్వం కోరుకున్నది.. ఇంకా చాలా మంది గిరిజన బిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించి గిరిజన బిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నా అని కేటీఆర్ అన్నారు.

ఏం పని నామోషీ కాదు.. మన వాళ్లు కూడా వేరే ఎక్కడో వెళ్లి పనిచేయటం కన్నా ఇక్కడే పనిచేయాలని కోరుతున్నా.. రాకేష్, మురళికి నా వంతుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని హామీ ఇస్తున్నా. మీడియా కూడా ఇలాంటి పాజిటివ్ స్టోరీలు ప్రసారం చేస్తే ఎంతో మందికి స్పూర్తిగా ఉంటుంది అని పేర్కొన్నారు.