mt_logo

మారుతున్న నేరాల ప్రవృత్తికి అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరముంది: కేటీఆర్

ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లుకు మద్దతిస్తూ అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును సమర్థిస్తూ ప్రభుత్వానికి మేము మద్దతిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా మనం ఆలోచించాల్సిన అవసరముంది అని పేర్కొన్నారు.

అత్యాచారాలు, సైబర్ క్రైమ్‌ల నేరాలను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం కలిగించాలి. ముఖ్యంగా లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసుల్లో శిక్షలు వేగంగా పడేలా చర్యలు తీసుకోవాలి. నేరాల ప్రవృత్తి మారుతోంది.. అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరముంది అని తెలిపారు.

ఇక ఇటీవల కేంద్రం తెచ్చిన న్యాయ చట్టాలు మనకు ఇబ్బందయ్యే పరిస్థితి కనిపిస్తోంది.. తెలంగాణ వామపక్ష, ప్రజా ఉద్యమాలకు అడ్డా. కానీ కేంద్రం తెచ్చిన చట్టాలతో పోలీసు రాజ్యమవుతుందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక, బెంగాల్, తమిళనాడు ఈ చట్టంలో మార్పులు చేయాలంటున్నాయి అని అన్నారు.

డైరెక్ట్‌గా ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. మనం కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కేంద్రం చట్టాలకు సవరణలు కావాలన్నారు అని సభకు తెలిపారు.

సైబర్ క్రైమ్స్ ద్వారా లక్షలు కోల్పోతున్నవారికి న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి..జస్టిస్ డిలేడ్.. జస్టిస్ డినైడ్ అంటారు. అందుకే వీలైనంత వేగంగా న్యాయం చేసేలా చట్టాలు ఉండాలి. ఇటీవల కేంద్రం సోషల్ మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా చట్టం తెస్తుందంటున్నారు. ఆ చట్టం వస్తే పౌరులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి బిల్లు ఏదైనా వస్తే మాత్రం మనమందరం కలిని దాన్ని అడ్డుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం అందరిమీద జరుగుతోంది. దీనికి ఒక పార్టీ మాత్రమే తప్పు చేస్తోంది.. మిగతా పార్టీలు పునీతులు అన్నట్లు ఏమీ లేదు. ఈ అంశంపై కూడా అవసరమైతే చర్చ జరిపే ప్రయత్నం చేయండి అని అన్నారు.