mt_logo

 తెలంగాణ శానిటేషన్ హబ్ భేష్ : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

ఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్ పూరి ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను అందించారు.కాగా హైదరాబాద్ నగరంలో భారీ శుధ్య కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రొక్యూర్మెంట్ కోసం, ట్రాన్స్ఫర్ స్టేషన్ ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద 400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.  3050 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 15% నిధులను కేంద్రం అందించాలని ఇందుకోసం 450 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్రం ఆర్థిక సాయం చేయాలి 

హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు 3722 కోట్ల రూపాయలు అని ఇందులో కనీసం 20 శాతం 744 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటన్నింటి  కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా 3777 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇందులో 750 కోట్ల రూపాయలను కేంద్రం ఆర్థిక సాయం చేయాలి కోరారు. 

శానిటేషన్ హబ్ పై ప్రసంశలు 

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమం పైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వలన పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరి కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి లింకు రోడ్లు, పారిశుద్ధ్య రంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు.