mt_logo

అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం.. ఇది కాంగ్రెస్ సర్కార్ దగా: కేటీఆర్

సకల జనులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతుల, కార్మికులు, మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే ఉన్నారు అని అన్నారు.

ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచడం ఏంటి.. ఇంత అన్యాయం ఎప్పుడైనా ఉందా? కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి? అని ప్రశ్నించారు.

కొత్త పీఆర్‌సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా? 11 నెలలు గడిచినా రెండో పీఆర్సీ నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? సీపీఎస్‌ రద్దు చేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి.. ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అని అడిగారు.

తెలంగాణ ఉద్యమంలో.. స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశాలు, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు. ఏఈవోల పనిభారం బాధ, ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు.. వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి అని ప్రభుత్వానికి సూచించారు