mt_logo

ఆస్తులను లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి జిట్టా కృషి చేశారు: కేటీఆర్

తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు.తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త తనను ద్రిగ్బంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిసున్నానన్నారు.

గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా కోలుకుంటారని భావించానని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి మొదటి నుంచి కేసీఆర్ గారి వెంట నడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరని కేటీఆర్ చెప్పారు. చిన్న వయసులో ఆయన లోకాన్ని వీడటం బాధిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంత ఆస్తులను కూడా లెక్క చేయకుండా ఉద్యమ నిర్మాణానికి తన వంతు కృషి చేశారని చెప్పారు. జిట్టా లాంటి నాయకున్ని కోల్పోవటం బీఆర్ఎస్ పార్టీకు తీరని లోటన్నారు.