mt_logo

ఆర్థికంగా అతలాకుతులమైన భారతదేశాన్ని ప్రధానిగా పీవీ కాపాడగలిగారు: పీవీ జయంతి వేడుకల్లో కేటీఆర్

భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మదిన వేడుకల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ గారు. ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా పీవీ గారిని చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదు అని కొనియాడారు.

భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి. ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగారు. పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారు అని పేర్కొన్నారు.

రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థిక వేత్తను తీసుకువచ్చి.. ఆర్థిక మంత్రిగా నియమించుకొని అద్భుతంగా ఆర్థిక సంస్కరణలను చేపట్టారు. 16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారు అని కేటీఆర్ అన్నారు.

తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారు. దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారు. పివీ గురించి ఎంత చెప్పినా తక్కువనే.. ఆయన నిత్య విద్యార్థి, 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న వ్యక్తి మనందరి జీవితాలకు ఆదర్శం అని కితాబిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పీవీ గారికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు గొప్పగా నడిపిన వ్యక్తి పీవీ అని అన్నారు.

మా పార్టీ తరపున అపురూపంగా ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించాం. కేవలం దేశంలోని కాకుండా దేశ, విదేశాల్లోనూ ప్రవాస భారతీయులందరిని కలుపుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. పీవీ నరసింహారావు పేరుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్డుకి నామకరణం చేయడం జరిగింది. ఘనమైన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పీవీ నరసింహారావు జీవితాన్ని కేంద్రం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు

ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ.. తెలంగాణ వెనకబడిన ప్రాంతమని చెప్పుకునే రోజుల్లోనే, తెలంగాణ నుంచి ఒక అపర మేధావిగా, అపర చాణక్యుడిగా, అద్భుతమైన రాజకీయ నాయకుడిగా సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని పీవీ గారు చక్కదిద్దగలిగారు. పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం, ఆయన సేవలను దేశం గుర్తించడం మొత్తం తెలంగాణకే గౌరవం అని అన్నారు.

ఇలాంటి మహానుభావుని సమాజం మర్చిపోతుంది అనుకుంటున్న సమయంలో కేసీఆర్ గారు, పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఘనతను, ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా చేశారు. కేసీఆర్ గారికి పీవీ గారి కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని తెలిపారు.