mt_logo

అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్

డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ వారసత్వాన్ని, లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతిని కాంగ్రెస్ నిర్వహించడం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా లేదు అని దుయ్యబట్టారు.

దళితులందరికి, సమాజంలోని ప్రజలందరికి స్ఫూర్తినిచ్చే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. దీని వెనుక ఉన్న లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. కేవలం కాంగ్రెస్ హైకమాండ్ ఉద్దేశాలతోనే అంబేద్కర్ విగ్రహానికి అవమానిస్తున్నారా? ప్రకాష్ అంబేద్కర్ చేత ప్రారంభించబడిన మహా విగ్రహానికి ఎందుకు అవమానిస్తుంది? అని ప్రశ్నించారు.

తాళాలు వేసి బంధించి కనీసం శుభ్రపరచకుండా ఎందుకు పెట్టింది. బీఆర్ఎస్‌పైన అక్కసు ఉంటే దానిని అంబేద్కర్ విగ్రహంపైన ఎందుకు చూపిస్తున్నారు? అంబేద్కర్‌కు నివాళులు అర్పించకుండా అడ్డుకుంటుంది మమ్మల్ని కాదు.. అంబేద్కర్ వారసులను, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అంబేద్కర్‌కి నివాళులు కూడా అర్పించాలన్న ఇంగిత సంస్కారం లేని కుసంస్కారి రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.

ప్రపంచం అబ్బురపడిన మహా మేధావి అంబేద్కర్ గారిని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్న 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పైన ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తున్నది. అంబేద్కర్ ఆలోచన విధానానికి అంబేద్కర్ విగ్రహానికే కాదు.. దళితుల అభివృద్ధికి సైతం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.

దళితబంధు పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది. దళితబంధు చెక్కులను రద్దుచేసి వారి జీవితాలను మారకుండా చేస్తున్నది. పేద, దళిత, గిరిజన బహుజన బిడ్డలను ఉన్నత చదువుల కోసం గత ప్రభుత్వం విదేశాలకు పంపిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఓర్వలేక వారి ఓవర్సీస్ స్కాలర్షిప్పులను నిలిపివేశాడు. తెలంగాణ బిడ్డలు విదేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

గురుకుల విద్యార్థులు మేము ఎవరెస్ట్ ఎక్కిస్తే ఈ ప్రభుత్వం వారిని పాడే ఎక్కిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివక్షను చేతగానితనాన్ని దాచిపెట్టడం కోసమే భారత రాష్ట్ర సమితి చేపట్టిన గురుకుల బాటను అడ్డుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నాయకులపైన కేసులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుని మాదిరిగా ఫోజులు కొడుతూ దేశంలో తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో తమను అడ్డుకున్న పోలీసుల పైన ఉక్రోషం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, అదే హోదాలో ఉన్న ఎమ్మెల్యేలను శాసనసభ పక్ష నేతలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తించాలి. తమ సొంత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న తీరుని గుర్తించాలి. నిజంగానే రాహుల్ గాంధీకి రాజ్యాంగంపైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపైన సద్బుద్ధి ప్రసాదించాలని సూచించాలి అని కేటీఆర్ సలహా ఇచ్చారు.

రానున్న అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలి. 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తాము. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేపం బట్టి ప్రతి అంశంపైన ప్రజా సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని స్పష్టం చేశారు.

మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రధాత కేసిఆర్ గారి పైన కాకికూతలు, కారుకూతలు మానకుంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే ముఖ్యమంత్రి సోనియాగాంధీని అడ్డగోలుగా దూషించిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. రేవంత్ రెడ్డి నోటి తీరు మార్చుకుంటేనే ఆయన పదవికి గౌరవం దక్కుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ ప్రవర్తనతో పదవులకు, వ్యక్తులకు గౌరవం వస్తుంది. కానీ అడుక్కుంటే కాదని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా.. కాంగ్రెస్ తల్లి విగ్రహమా.. చెప్పాలి. ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాల రూపులు చరిత్రను మారుస్తామంటే ఎవరు ఒప్పుకోరు. ఉద్యమకాలంలో సబ్బండ వర్గాలు, కవులు, కళాకారులు, మేధావులు అంతా కలిసి తెలంగాణ పరిస్థితిలకు అనుగుణంగా సంస్కృతికి అనుగుణంగా రూపం ఇచ్చిన తల్లి విగ్రహమే తెలంగాణ తల్లిబని తెలిపారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలను దాటుకొని ఒక దేవతను ఊరేగించిన మాదిరి తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన చేశాము. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపు మారుస్తానని తెలంగాణ చరిత్రను మారుస్తానని నీచమైన మనస్తత్వంతో ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తర్వాతి ప్రభుత్వాలు మార్చినాయా? తెలుగు తల్లిని, కన్నడ తల్లిని మార్చనప్పుడు తెలంగాణ తల్లిని మార్చే కుసంస్కారం, భావదారిద్ర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు? అని అడిగారు.

ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాగానే రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఏర్పాటు చేసిన చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తాం. అమరవీరుల స్తూపానికి అంబేద్కర్ సచివాలయానికి మధ్యన ఉండాల్సింది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం. అందుకే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పంపాల్సిన చోటికి పంపిస్తాం. తెలంగాణ చరిత్రను మారుస్తామంటే ఊరుకునేది లేదు అని కేటీఆర్ హెచ్చరించారు.