mt_logo

బీసీలకు 42% రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము: కవిత

కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

మంగళవారం నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు మరియు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్ధతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్దీపొందే ఫీజు రియింబర్స్ మెంట్, పూలే స్కాలర్‌షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీల కోసం అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, ఇప్పుడు వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటివరకు బీసీ సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారని చెప్పాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.