mt_logo

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య లంచం తీసుకునే అవకాశముంటుందా: విచారణ కమీషన్‌కు జగదీష్ రెడ్డి లేఖ

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నా పీఏ ద్వారా విచారణ కమీషన్ ఆఫీసుకు లెటర్ పంపించాను. కమీషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం చెప్పాను అని అన్నారు.

ఛత్తీస్‌ఘడ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొన్నాము. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్‌ను 17 రూపాయలకు కొంటున్న పరిస్థితి వుంది అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారు. పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలి. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 4.90 పైసలకు విద్యుత్ తీసుకున్నారు. కేసీఆర్‌పై నింద వేద్దామని ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాం అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు

బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది.. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. సింగరేణి బొగ్గు ఉండటం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒప్పుకోలేదు. మేము కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చింది అని అన్నారు.

విద్యుత్ విచారణ కమీషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసింది. విద్యుత్ కొనుగోళ్ళల్లో ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. ఛత్తీస్‌ఘడ్ నుండి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం రాసుకోలేదు. కేసీఆర్, రమన్ సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగింది అని తెలిపారు.

విచారణ కమీషన్ సరిగా లేదని నేను లేఖ రాశాను.. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను విద్యుత్ విచారణ కమీషన్‌కు నేను లేఖ రాశాను. విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఎక్కడైనా లంచం తీసుకునే అవకాశం వుంటుందా. నా లేఖ చూసిన తర్వాత విచారణ కమీషన్ చైర్మన్ మనసు మార్చుకుంటారని భావిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.