mt_logo

సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి అయింది. బడే భాయ్ నోట్ల రద్దుతో ఏం తప్పు చేశారో ఇక్కడ చోటా భాయ్ హైడ్రా విషయంలో తప్పు చేశారు..నల్లధనం బయటకు తెస్తానని మోడీ 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నోట్ల రద్దు దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసింది అని అన్నారు.

హైడ్రా ఎవరి మీద కక్షతో తెరపైకి తెచ్చారు? ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారు. మూసీ సుందరీకరణ ఎవరి కోసమో చెప్పాలి. రేవంత్ రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా, మూసీ వచ్చింది. రూ. లక్షా 50 వేల కోట్లు అని ఎవరు చెప్పారని డిప్యూటీ సీఎం అంటున్నారు అని గుర్తు చేశారు.

మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా.. చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా.. మీ చేతికి అధికారం వచ్చాక ఏం జరిగిందో చర్చకు రెడీనా. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము నీకు, నీ ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు.

మూసీతో లక్ష కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది.. ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లు కూల్చారు. మీ కడుపు నింపుకునేందు కోసమే మూసీ ప్రాజెక్టు. డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

అబద్ధాలు చెప్పడంలో భట్టి రేవంత్ రెడ్డిని మించిపోతున్నారు.. డబ్బులు సంపాదించడంలో భట్టి సీఎంతో పోటీ పడుతున్నారు. బుకాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూసీపై ప్రణాళిక మీ దగ్గర ఉందా. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. పాత బాసులు, కొత్త బాసులు కారణం అని విమర్శించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారికి కాంగ్రెస్ కారణం కాదా.. ఫ్లోరోసిస్‌ను రూపుమాపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనకు రూ. 16 వేల కోట్లతో బీఆర్ఎస్ పనులు ప్రారంభించింది. కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు త్రాగునీరు అందించాము అని తెలిపారు.

కొండపోచమ్మ సాగర్ నుండి హిమాత్ సాగర్‌కు నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.. మీకు చేతకాకపోతే చేయడానికి మేము రెడీగా ఉన్నాం అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు

మేము ఇచ్చిన 24 గంటల కరెంటు ఇవ్వడం మీకు చేతకావడం లేదు. రుణమాఫీ పూర్తి చేస్తానని చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన పింఛన్లు మాత్రమే ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన కళ్యాణాలక్ష్మి ఇస్తున్నారు.. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వరికి బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. కమిషన్లు రావనే రైతుబంధు ఇవ్వడం లేదు..సంక్షేమ పథకాలు అందుకే అమలు కావడం లేదు అని దుయ్యబట్టారు.

మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకువస్తారు.. హాస్టల్స్‌లో ఇప్పటి వరకు 26 మంది విద్యార్థులు చనిపోయారు అని అన్నారు.

ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. చాలామంది నియంతలు పోయారు.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారు..మూసీ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటాము. సోషల్ మీడియా వాళ్ళను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ భవన్ అంటే కేవలం భవనం కాదు..తెలంగాణ ప్రజలకు ఓ దైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీక అని కేసీఆర్ అప్పుడే చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు తండోపతండాలుగా రావడం కేసీఆర్ అన్న మాటలను రుజువు చేసింది. హర్యానా ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా బీజేపీ గెలిచింది అని వ్యాఖ్యానించారు.