
సీఎం కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దాదాపు 1500 ఐటీ, ఐ.టీ.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ధి ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 % వృద్ధి సాధించింది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అమెజాన్ డేటా సర్వీస్ సెంటర్ రూ.20,761 కోట్లతో ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, చందన్వెల్లిలలో 3 డేటా సెంటర్లను నెలకొల్పుచున్నది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 500 కోట్లతో స్మార్ట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నది. సేల్స్ ఫోర్స్ రూ.1119 కోట్లతో విస్తరణ చేపట్టింది. గోల్డ్ మన్ సాచ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్ ఇన్సూరెన్స్ దిగ్గజ కంపెనీ మాసెచూసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1000 కోట్లతో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది.

ఒప్పో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ప్రముఖ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది.
కార్పొరేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు తమ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్లను హైదరాబాద్ నందు ఏర్పాటు చేస్తున్నాయి.
రాజకీయ సుస్థిరత, సమర్ధ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు ‘బ్రాండ్ హైదరాబాద్’ను కాపాడటమే కాకుండా మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఐటీ రంగాన్ని వికసింప చేశాయి. భారతదేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ప్రతీ యేడు అధికంగానే ఉంటూ వస్తున్నది.
ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ 19 మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కూడా తట్టుకొని తెలంగాణ ఐటీ రంగం పురోగమించింది. భారతదేశ సిలికాన్ వ్యాలీగా, ఐటీ క్యాపిటల్ గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును అధిగమించే దిశగా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తున్నది.
యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్ క్రిస్లర్, మాస్ మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్ మ్యాన్ సాచ్స్, జెడ్.ఎఫ్ , యు బి ఎస్ , పెప్సి, లేగటో లాంటి కంపెనీలను ఆకర్షించడం తో పాటు ఫేస్ బుక్ , క్వాల్కామ్, యాక్సెంచర్, వెల్స్ ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలు విస్తరించాయి.
ఐటీ రంగం అభివృద్ధి మిగతా రంగాలైన నిర్మాణ రంగం, రవాణా రంగం. వినోద రంగాలపై ప్రభావం చూపెడుతుంది. ఒక పక్క ఐటీ రంగంలో దూసుకుపోతుండగా టైర్-2 నగరాల్లో ఐటీ టవర్ల నిర్మాణంతో కొత్త కంపెనీలు ఏర్పాటయి స్టానిక యువతీ , యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

టీ హబ్ విజయ ప్రస్థానం:-
స్టార్టప్లను ప్రోత్సాహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ 1, టీ హబ్ 2 లను నెలకొల్పింది. ఈ వేదికలు నేడు తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచాయి. సాంకేతిక రంగంలో టీ హబ్ సృష్టిస్తున్న అద్భుతాలు నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
టీ హబ్ 1:
ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్లకు ఇంక్యుబేటర్ టీ హబ్ 1 ను 2015 నవంబర్ 5 న గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రారంభం అయింది. దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ గానే కాదు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్గా నిలిచింది. టీ-హబ్ ద్వారా రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి సాధిస్తున్నది. అతి స్వల్ప సమయంలోనే టీ హబ్ దేశ విదేశాలలో ప్రముఖుల ప్రశంసలు పొందింది.
టీ హబ్ 2:
400 కోట్ల రూపాయలతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2 ను ప్రపంచలోనే అతిపెద్దదైన స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ గా భారీ స్థాయిలో నిర్మించడం జరిగింది. దీని కోసం రూ.276 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. ఆవిష్కరణ (ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళిత వృద్ధి (ఇన్క్లూజివ్ గ్రోత్) అనే ‘త్రీ ఐ’ సూత్రాలు అమలు చేయడమే లక్ష్యంగా టీ హబ్ 2. ను స్థాపించడం జరిగింది.

టీ ఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్ గ్రిడ్ పథకం)
తెలంగాణ ప్రభుత్వ ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీ ఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్ గ్రిడ్ పథకం) ను ప్రవేశ పెట్టింది. దేశంలోనే ప్రప్రధమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకమిది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న ఆన్లైన్ సేవలను ప్రజలు సులువుగా పొందవచ్చు.
టెలికాం ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం ద్వారా T-ఫైబర్ ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. గ్రామ పంచాయతీలు, గ్రామీణ గృహాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు నెట్వర్క్ను అనుసంధానించడం ద్వారా ఇది సేవలు అందిస్తున్నది.
ఫేజ్ -I లో భాగంగా 33 జిల్లాలు, 12769 గ్రామపంచాయతీలు, 142 పట్టణ స్థానిక సంస్థలు 30,000 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పిస్తున్నది. మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు డిజైన్ చేయబడిన టీ-ఫైబర్కు ఐసిటీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) బిజినెస్ ఎక్సలెన్స్ -2022 అవార్డు లభించింది.

టీ వర్క్స్:-
టీ వర్క్స్ ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అతిపెద్ద ప్రో టైపింగ్ సెంటర్, ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్ళండి. అనే నినాదంతో వర్క్స్ రూపొందింది. పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగాల విస్తరణకు అవసరమయ్యే ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం న్యూ ఎలక్ట్రానిక్ హబ్గా అవతరిస్తున్నది. ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ , బ్లాక్ చైన్, క్లౌడ్ , డ్రోన్స్, ఐఓటీ, రోబోటిక్స్ , స్పేస్ టెక్నాలజీ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నది.