mt_logo

చేతివృత్తుల‌కు చేయూత‌.. రూ. ల‌క్ష సాయానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 6: స‌మైక్య‌పాల‌న‌లో కులవృత్తులు కునారిల్లుపోయాయి. చేతివృత్తుల‌వారు చేవ‌లుడిగి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. బ‌తుకుదెరువు కోసం కుల‌వృత్తుల‌ను వ‌దిలి కూలి ప‌నుల‌కు మ‌ళ్లారు. బొంబాయి, దుబాయికి వ‌ల‌సబాట ప‌ట్టారు. కానీ.. స్వ‌రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక కుల‌వృత్తుల‌కు పున‌రుజ్జీవం పోశారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌తో చేతివృత్తుల‌వారికి ఊత‌మ‌య్యారు. తాజాగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ద‌ర‌ఖాస్తు ఇలా..
వెనుక‌బ‌డిన వ‌ర్గాల కులవృత్తులు, చేతివృత్తుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం అందించే ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌ల‌తో స‌ర‌ళ‌మైన అప్లికేష‌న్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా త‌క్ష‌ణ‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జూన్ 9వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. అదే రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల‌చే ల‌బ్దిదారుల‌కు రూ. ల‌క్ష పంపిణీ చేయ‌నున్నారు.