mt_logo

రేవంత్ ‘పాప పరిహారానికి’.. రేపు యాదాద్రికి హరీష్ రావు

ఆగస్టు 15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఆగస్టు 15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయబోతున్నాము అని పేర్కొన్నారు.

ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటాము. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తాం అని అన్నారు

రూ 49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు. క్యాబినెట్‌లో నిర్ణయించిన రూ. 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 26 వేల కోట్లకు కుదించారు. ఆగస్టు 15 నాడు రుణమాఫీ పూర్తయిందని చెప్పి రూ. 17 వేల కోట్లన్నారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే.. మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారు అని దుయ్యబట్టారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన రూ. 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు అని విమర్శించారు.

కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు రేపు ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటాను అని హరీష్ రావు అన్నారు.. రైతలందరి తరుపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదాం అని పిలుపునిచ్చారు.