mt_logo

సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారు: హరీష్ రావు

30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు.. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు అదే చేస్తున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తామే తీసుకువచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు.ఈ ప్రాజెక్టు క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారు. ఈ నెల 15 న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును తనకూ ఇష్టమైన పనిగా మొదలు పెట్టారు.. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది. రిబ్బన్ కటింగ్ చేసే ఆవకాశం వచ్చిందని ప్రాజెక్టు తామే కట్టామని కాంగ్రెస్ మంత్రులు కటింగ్ ఇచ్చుకుంటున్నారు అని దుయ్యబట్టారు.

ఈ ఏడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తయిందంటున్న కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారు.. 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు సీతారామ ప్రాజెక్టు విషయంలో చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టును అడ్డంకులు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారు. ఈ విషయాన్ని అపుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావే స్వయంగా చెప్పారు. సీతారామ ప్రాజెక్టును ఘనత కేసీఆర్‌ది కాదని తుమ్మల గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అని అడిగారు.

కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు.. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఖమ్మంకు గోదావరి జలాలు ఇవ్వాలనే ప్రయత్నం చేయలేదు. ఖమ్మంను రెండు పంటలు పంటే జిల్లాగా మార్చాలని సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ సంకల్పించారు అని హరీష్ రావు గుర్తు చేశారు.

ఇందిరా, రాజీవ్ సాగర్‌ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లను ప్రతిపాదిస్తే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకునేలా ప్లాన్ చేశారు. మా ఘనతను వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్న వారిని పరాన్నజీవులు అంటారు. సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయంలోనే 90 శాతం పూర్తయ్యింది అని తెలిపారు.

మెయిన్ కెనాల్‌లో ఎనిమిది ప్యాకేజీలు ఉంటె ఐదు ప్యాకేజీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి.. సీతారామ ప్రాజెక్టుకు హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. నీళ్ల మంత్రి ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తామే తీసుకువచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ఇంత దిగజారి మాట్లాడాలా అని ధ్వజమెత్తారు.

జూలై 2023లోనే 67 టీఎంసీలకు కేంద్ర జలసంఘం అనుమతి ఇచ్చింది. 2005 నుంచి తొమ్మిదేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజీవ్ సాగర్లకు ఒక్క అనుమతి తీసుకురాలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నపుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రయత్నం చేయలేదు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లు అందేలా సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారు అని అన్నారు.

జూన్‌లోనే ఖమ్మం జిల్లాలో నాట్లు పడేలా సీతారామ ప్రాజెక్టును రూపొందించాం. 3 వేల చెరువులను నింపేలా సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశాం. పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలపడం వల్ల ఖమ్మం పట్టణానికి తాగునీటి సమస్య లేకుండా పోతోంది అని హరీష్ రావు తెలిపారు.

కేసీఆర్ గారు స్వయంగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు..కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు సాధించలేదు. సాగర్ ఆయకట్టు 3.4 లక్షల ఎకరాలకు కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరందించేలా కేసీఆర్ పూనుకున్నారు.. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్‌వాటర్స్ ద్వారా నల్లగొండ జిల్లాకు సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను అందించేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాం.. ఎంతో ముందుచూపుతో కేసీఆర్ ఈ సీతారామ ప్రాజెక్టును ప్రతిపాదించారు అని గుర్తు చేశారు.

సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలో పాలన పడకేసింది.. అంతా గందరగోళంగా మారింది. లిక్కర్ టార్గెట్‌ల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది తప్ప ప్రజారోగ్యం మీద పెట్టలేదు.. విషజ్వరాల బారిన పడి పిల్లలు చనిపోతున్నారు. పబ్లిసిటీ స్టంట్లు తప్ప గవర్నెన్స్ మీద దృష్టి పెట్టడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు ప్రారంభించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిందేమి లేదు అని విమర్శించారు.

సర్పంచ్‌లే కాదు.. పంచాయతీ సెక్రటరీలను అప్పులు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. దమ్ముంటే మా నియోజకవర్గానికి కాంగ్రెస్ మంత్రులు వస్తే పంచాయతీల్లో నెలకొన్న దుస్థితిని నిరూపిస్తా అని సవాల్ విసిరారు.

సీతారామ ప్రాజెక్టులో మూడు పంపులు, సబ్ స్టేషన్ల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయి.. 75 కోట్ల రూపాయలతో లక్షన్నర ఎకరాల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నాగార్జున సాగర్, ఆల్మట్టి వైపు ఖమ్మం జిల్లా ప్రజలు చూడకుండా సీతారామ ప్రాజెక్టు ప్రతి ఇంచి భూమిని సస్యశ్యామలం చేస్తుంది అని అన్నారు.