mt_logo

రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం వల్ల రూ. 20 వేల కోట్ల భారం: హరీష్ రావు

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క చీర కాదు, మేము అధికారంలోకి వస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పారు. బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా.. ఉన్న చీర కూడా బంద్ పెట్టారు అని దుయ్యబట్టారు.

అధికారంలోకి వస్తే రైతు బంధు రూ.10,000 కాదు.. రూ. 15,000 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. కేసీఆర్ కిట్ బంద్ చేశారు. చేప పిల్లలు చెరువుల్లోనే వదలడం లేదు.. చేప పిల్లలు తక్కువగా పోవాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చేప పిల్లలకు టెండర్ పిలవలేదు.. ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అని విమర్శించారు.

మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇవాళ ఈ మార్పులు చేస్తోంది. డబుల్ చేప పిల్లలు చెరువుల్లో వేస్తామని చెప్పి ఒక్క చేప పిల్ల కూడా చెరువుల్లో వేయలేదు.. ఇదీ మార్పు.. చెరువులు పూర్తిగా నిండినప్పటికీ చేప పిల్లలు ఎందుకు వేయడం లేదు? ఆగస్ట్‌లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు. మేము రూ. 100 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్‌లో పెట్టిందే రూ. 16 కోట్లు అని అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్ మా హయంలో ఉత్తర, దక్షిణ భాగం రెండు భాగాలుగా ప్రతిపాదన చేశాం. ఉత్తర భాగం 158 కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భూసేకరణ కోసం 3A ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది.. ఖర్చు మాత్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి సగం భరించేలా ప్రతిపాదన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది, భూసేకరణ చేయడం లేదు.. ఎందుకు ఆలస్యం జరుగుతోంది? అని హరీష్ రావు అడిగారు.

ఉత్తర భాగంలో యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలి. ఐసీటీ దక్షిణ భాగంలో అలైన్మెంట్ ఫైనల్ చేయమని నేషనల్ హైవే అథారిటీ వారు చెప్పారు… 182 కిలోమీటర్ల అలైన్మెంట్ పూర్తి చేసింది. దక్షిణ భాగం అలైన్మెంట్ పూర్తిగా మార్చారు.. ప్రముఖుల భూములు ఉన్నాయి అని అలైన్మెంట్ మార్చారు. ఒక్కసారి ఫైనల్ చేసిన అలైన్మెంట్‌ను మార్చడం నేషనల్ హైవే అథారిటీ వారు ఒప్పుకోరు అని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చింది అని అన్నారు.

నేషనల్ హైవే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్‌ని ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్లతో దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతుంది. అలైన్మెంట్ మార్చడం వల్ల 182 కిలోమీటర్ల నుంచి 198 కిలోమీటర్లకు పెరిగింది. కాంట్రాక్టర్ల లాభం కోసం రూ. 20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తున్నారు అని ఆరోపించారు.

రుణమాఫీ కోసం అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారు.. అలైన్మెంట్ మార్చడం వల్ల రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు మరి? మీ లాభం కోసం రూ. 20,000 కోట్ల అప్పు చేస్తారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఏసీపీడీ నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది.. ప్రజా పాలన అని గొప్పగా చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో పొందుపర్చిన విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఏసీపీడీ నిధులు రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పారు. 6 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదు. కనీసం ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు అని హరీష్ మండిపడ్డారు.