mt_logo

ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు

రాష్ట్ర బడ్జెట్‌పై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉంది. ప్రజల ఆశలను వమ్ము చేశారు.. హామీలకు కేటాయింపులు లేవు అని అన్నారు.

ఆరు గ్యారంటీలకు కేటాయింపులు లేవు.. అభివృద్ధి అగమ్య గోచరం.. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపే బడ్జెట్ ఇది. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో కేటాయింపులేవీ? ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్లో ఎలాంటి దశా, దిశాలేదు అని దుయ్యబట్టారు.

ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలన్నారు.. బడ్జెట్లో ఆ ప్రసక్తి లేదు. మేం అప్పులు చేశామని నిందించారు.. భట్టి రూ. 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు.. మా ప్రభుత్వం తెచ్చినదానికంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువ తెస్తామన్నారు. భట్టి ఆరు గ్యారంటీలను తన బడ్జెట్లో పూర్తిగా మరిచిపోయారు అని విమర్శించారు.

ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 గురించి ప్రస్తావించలేదు.. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించింది. రూ. 4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు.. మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదు? అత్యంత పేదలైన అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వింతంతువులు, దివ్యాంగుల ఆశలను మీ ప్రభుత్వం నీరుగార్చింది.. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు.. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు అని ధ్వజమెత్తారు.

జాబ్ క్యాలండర్, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు.. ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మొండిచేయి చూపారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారు. గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అనడం అన్యాయం. కేసీఆర్ అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను మేం నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చాం. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,47,099 రూపాయలు అయితే , దేశ తలసరి ఆదాయం రూ. 1,83,236.. అంటే రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే 1 లక్ష 64 వేల 63 రూపాయలు ఎక్కువ.. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితం. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 4,51,580 కోట్లు.. 2023-24 నాటికి అది రూ. 14,63,963 కోట్లు . అంటే మూడు రెట్లు పెరిగింది. తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశ వృద్ధి రేటు 9.1 శాతమే. తెలంగాణ గ్రోత్ రేటు బావుందని నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుంది అని హరీష్ రావు గుర్తు చేశారు.

వ్యవసాయానికి ఊతమిచ్చి కోటి 27 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిని 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచాం. పంజాబ్‌ను తలదన్ని ఎదిగామంటే కేసీఆర్ పనితీరు కారణం కాదా? పండిన పంట నిజం కాదా? మీ బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా? బడ్జెట్లో గొల్ల కుర్మలకు మోసం చేశారు.. గతేడాది 50 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు సున్నా కేటాయించారు అని అన్నారు.

పింఛన్లు పెంచడం లేదని అర్థమైంది.. గతేడాది రూ. 7,335 కోట్లు పెడితే, ఇపుడు రూ. 7,376 కోట్లు మాత్రమే పెట్టారు. ఈసారి కొత్త పింఛన్ ఇవ్వరని తేలిపోయింది. ఆగస్ట్ 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. రూ. 31 వేల కోట్లు ఇస్తామన్నారు.. కానీ బడ్జెట్లో రూ. 15,470 కోట్లు మాత్రమే కేటాయించారు? ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? రైతుబంధు స్థానంలో రైతుభరోసా అన్నారు.. దాని ఊసు కూడా లేదు అని మండిపడ్డారు.

మైనారిటీలకు రూ. 4 వేల కోట్లని మేనిఫెస్టోలో చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరానికి బీసీలకు రూ. 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇరిగేషన్‌కు కూడా నిధులు తగ్గించారు.. పోయినేడాది మేం రూ. 26,825 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ. 22,300 కోట్లు మాత్రమే కేటాయించారు. దళితబంధు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచుతామన్నారు.. ఆ ప్రస్తావన కూడా లేదు.. గిరిజన బంధులేదు.. ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలు బాకీ పడ్డది.. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు.. పీఆర్సీ ప్రస్తావన కూడా లేదు. కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు అని పేర్కొన్నారు.

గత బడ్జెట్లో నేను చూపిన ఎక్సైజ్ ఆదాయం రూ. 18,470 కోట్లు. భట్టిగారు ప్రతిపాదించింది రూ. 25,617 కోట్లు.. అంటే ఏడు వేల కోట్లు ఎక్కువ.. గల్లీకో వైన్ షాప్ పెడతారా? ఎక్సైజ్, వ్యాట్ కలుపుకుంటే రూ. 15 వేల కోట్ల ఎక్కువ ఆదాయం రాబడతామని చెప్పారు. అంటే తాగుబోతు తెలంగాణను తయారుచేస్తారా? స్టాంపు డ్యూటీ ఆదాయం రూ. 14,295 కోట్లని గత బడ్జెట్లో నేను ప్రతిపాదిస్తే భట్టి రూ. 18,228 కోట్లు అన్నారు.. అంటే 4 వేల కోట్ల ఎక్కువ. భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారు అని అన్నారు.

గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం లేదు.. నెలకు 7 వేల కోట్లను వడ్డీ కింద కడుతున్నామని సీఎం, భట్టి చెబుతున్నారు. వచ్చే ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 17,729 కోట్లని చూపించారు. ఏది నిజం, ఏది అబద్ధం? గ్రామాలకు రోడ్లు, ట్రాక్టర్, డంప్ యార్డ్, వైకుంఠధామం వంటి సంకల సదుపాయాలు కల్పిస్తే మేమేమీ చేయలేదని అన్నారు. ఒక్క డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని భట్టి ఆరోపించారు.. నా హయంలో 30 వేల పోస్టులను భర్తీ చేశానని సవాల్ చేస్తున్నా. మీ గౌరవాన్ని మీరే తీసుకుంటున్నారు.. ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నీరుగార్చింది అని హరీష్ ఫైర్ అయ్యారు.