![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-23-at-3.05.18-PM.jpeg?resize=1024%2C576&ssl=1)
బడ్జెట్ సమావేశాలను కేవలం నాలుగు రోజులకు కుదిస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం హామీల ఎగవేతనే కాదు.. ఆసెంబ్లీ సమయంపై ఎగవేత ధోరణి అవలంబిస్తోంది. బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులకు కుదిస్తున్నారు. కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశాము. డిమాండ్లపై రెండు రోజులే చర్చా.. ఇది దారుణం అని దుయ్యబట్టారు.
గతంలో కేసీఆర్ హయాంలో తొమ్మిది రోజులు డిమాండ్లపై చర్చ జరిగేది. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది.. పాలకపక్షం దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది.. రేపటి ఎజెండా ఇంకా ఖరారు చేయలేదు. ఈ సాయంత్రం రేపటి చర్చను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారు అని అడిగారు.
నిరుద్యోగుల అంశంపై రేపు చర్చా చేపట్టాలన్నాము.. తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించాం. శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారంటీలు చట్టబద్ధత, రైతు రుణమాఫీ ఆంక్షలు, అన్ని పంటలకు బోనస్, రైతు భరోసా, పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం, స్థానిక సంస్థలకు నిధులు, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులు, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటి తొమ్మిది అంశాలు చర్చను పెట్టాలని కోరాం అని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు.. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారు, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏది ,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏది. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని హరీష్ రావు ధ్వజమెత్తారు.