mt_logo

రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. కలిసి పోరాడుదాం: హరీష్ రావు పిలుపు

తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దని.. కలిసి పోరాటం చేద్దాం అని రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో హరీష్ రావు సందర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్‌కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని పేర్కొన్నారు.

పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి.. ధైర్యాన్ని కోల్పోకండి అని రైతులకు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం.. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం అని హరీష్ రావు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు.. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. దయచేసి బాధ్యతగా వ్యవహరించి.. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాఫీ అమలు చెయ్యండి అని సీఎంని కోరారు.

రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ నిర్దేశించుకున్న డెడ్‌లైన్ ముగిసి నెలకావొస్తున్నది.. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండి అని అన్నారు.