mt_logo

బీజేపీ పంచన చేరి, బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి: హరీష్ రావు

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు అని దుయ్యబట్టారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్‌లో బీజేపీ ఎలా గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారంతా కలిసి బీజేపీని గెలిపించారా అని అడిగారు.

కొడంగల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారా? రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

బీజేపీ పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి.. నిండు సభలో మోడిని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి.. మోడీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారు అని ఆరోపించారు.

విభజన హామీలపై రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.