mt_logo

కోతలు పెట్టడం, బంద్ పెట్టడం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు: హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు ఐదేళ్లపాటు ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కరోనా కష్టకాలంలో సైతం విధులు నిర్వహించారు.. మిమ్మల్నందరిని అభినందిస్తున్నాం అని అన్నారు.

దుబ్బాకలో ప్రభాకర్ అన్నను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రజాప్రతినిధులను సన్మానించాలన్న మంచి ఆలోచన చేసిన ప్రభాకరన్నకు ధన్యవాదాలు అని తెలిపారు.

పదవీ విరమణ పదవికే తప్ప ప్రజాసేవకు ఉండదు. మీకు ఇకపైనా అదే గౌరవం ఉంటుంది.. ఇదే ఆఖరు కాదు.. మీకు మళ్లీ పదవులు వస్తాయి. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం.. గెలుపు ఓటము శాశ్వతం కాదు.. బీఆర్ఎస్ మళ్లీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది ఆని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ గ్రామ పంచాయతీయలకు నిధులు ఇవ్వడం లేదు.. పారిశుధ్య, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాల్లేవు. పల్లెలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. మీకు కూడా ఏడు నెలలుగా జీతాలు రావట్లేదు. కాంగ్రెస్ పాలనను గాలికి వదిలేసింది.. ప్రతిపక్షాలను వేధించడం, పగ సాధించడమే పనిగా పెట్టుకుంది అని హరీష్ రావు విమర్శించారు.

రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగాయి.. శాంతిభద్రతలు గాడి తప్పాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైతుబంధు సమయానికి ఇవ్వడం లేదు.. అవ్వాతాతల ఫించన్ పెంచలేదు.. వస్తున్న రెండు వేలు కూడా పెండింగ్‌లో పెట్టారు. పొలాలకు సాగునీళ్లు లేవు.. కరెంట్ లేదు.. మోటర్లు కాలిపోతున్నాయి.. కేసీఆర్ కిట్ బంద్ చేశారు అని దుయ్యబట్టారు.

అన్నిటికి కోతలు పెట్టడం, బంద్ పెట్టడం.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ రెప్పపాటు కూడా పోలేదు, ఇప్పుడెందుకు పోతోంది? అని అడిగారు.

మీరు ఎన్నికల్లో గెలవడానికి నేను, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.. ప్రజల కష్టసుఖాల్లో భాగమవ్వండి అని హరీష్ రావు అన్నారు.