mt_logo

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసింది: హరీష్ రావు

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసింది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ముఖ్యమని కేసీఆర్ గారు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. పారిశుధ్యం పడకేసింది.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది అని దుయ్యబట్టారు.

ఏడు నెలల్లో నయా పైసా కూడా పల్లె, పట్టణాలకు విడుదల చేయలేదు.. మేము ప్రతి నెలా నిధులు విడుదల చేశాం. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. సర్పంచుల కాలం ముగిసింది.. జిల్లా పరిషత్ కాలం ముగుస్తున్నది.. ఎన్నికలు నిర్వహించలేదు. నాడు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉంటే, నేడు 12,769 పంచాయతీల్లో ట్రాక్టర్లు అని అన్నారు.

దీన్‌దయాల్, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయి. కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. అస్తవ్యస్తం అవుతున్నాయి. ట్రాక్టర్లు మూలన పడ్డాయి.. పెట్రోల్ కూడా పోయించే పరిస్థితి లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ టాక్స్ లేదు, బీమా లేదు అని ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నరు అని తెలిపారు.

పంచాయతీ సెక్రటరీలు చెప్పినా అధికారులు వినడం లేదు.. సొంత డబ్బులు పెట్టి పంచాయతీ సెక్రటరీలు డీజిల్ పోయిస్తున్నారు.. బుగ్గలు పెడుతున్నరు. పారిశుధ్య కార్మికులు 7 నెలలు జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..కరెంట్ బిల్లులు కట్టడం లేదు.. ట్రాక్టర్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడం లేదు. గ్రామ పాలన అస్తవ్యస్తం అయ్యింది అని విమర్శించారు.

పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడిక్కడ పేరుకు పొయ్యింది. స్పెషల్ డ్రైవ్ కాదు, ఉన్న చెత్త ఎత్తుకోవడం లేదు. ప్రజా పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా? జీతాలు లేకుండా వాళ్లు ఎలా బతుకుతారు? ఎందుకు సమీక్షలు చేయడం లేదు.. సమయం ఉండటం లేదా అని అడిగారు.

చివరకు గవర్నర్‌ను కలిసి సర్పంచులు వినతి ఇచ్చే పరిస్థితి వచ్చింది.. వానాకాలం వచ్చింది.. పంచాయతీల్లో డబ్బులు లేక ట్రాక్టర్ డీజిల్ పైసలు లేవు, ఫాగింగ్ లేదు, విద్యుత్ నిర్వహణ లేదు. మేము ప్రతి నెలా రూ. 275 కోట్లు, ఏటా రూ. 3,330 కోట్లు పల్లెల్లో అభివృద్ధి కోసం ఇచ్చాం.. పట్టణాలకు ఏటా రూ. 1,700 కోట్లు ఇచ్చే వాళ్ళం అని గుర్తు చేశారు.

మీరు ఏడు నెలల్లో ఎందుకు ఏడు పైసలు ఇవ్వలేదు.. స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు.. మలేరియా, డెంగీ వైరల్ జ్వరాలు ప్రభలితే బాధ్యత ఎవరిది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాం. పల్లె, పట్టణ ప్రగతి కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశాము. ఎంత దారుణం అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా జీతం రాలేదు అని హరీష్ రావు ధ్వజమెత్తారు

రిటైర్మెంట్ శాలువాలు కప్పుకొని జీతాలు రాలేదు అని అంటున్నారు. తక్షణం పారిశుద్ధ్య కార్మికులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అడీషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అని పోస్ట్ పెట్టి మేము కృషి చేస్తే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, చేసిన పనులకు గానూ సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులు విడుదల చేయాలి. పారిశుద్ద్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలి. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది కాబట్టి, గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలి అని అన్నారు.

నిరుద్యోగులను నిలువున ముంచారు.. సంక్షేమాన్ని సమాధి కట్టారు.. అంక్షలు తప్ప పింఛన్లు లేవు. చంద్రబాబు బకాయిలతో కలిపి రూ. 4 వేల ఫించన్ ఇస్తే, ఇచ్చేవి ఇవ్వడం లేదు.. పెంచడం లేదు. రెండు నెలల ఆసరా ఫించన్ వెంటనే విడుదల చేయాలి అని హరీష్ అడిగారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్న అని ఒక రైతు ప్రభాకర్ ఖమ్మంలో చనిపోయారు.. ఎంతో బాధ వేసింది. ఆయన ఆత్మహత్య బాధాకరం.. వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.. రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభాకర్ తండ్రి పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అని ఫైర్ అయ్యారు.

ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పాలన కారణం. ఎస్సై, ఎమ్మార్వో, కలెక్టర్ వీరిలో ఎవరు పట్టించుకున్నా న్యాయం జరిగేది. ఏ రైతు ప్రాణాలు కోల్పోవద్దు.. ప్రశ్నించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి.. వారు వినకుంటే మాకు చెప్పండి.. మీ తరుపున పోరాటం చేస్తం.. అండగా ఉంటాం అని స్పష్టం చేశారు.

చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయకుండా, వీడియో తీసిన వారి మీద కేసులు పెడతారట.. ఆ రైతు నేరుగా మీ పేరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు.. ఆ రైతు తరుపున రేవంత్ రెడ్డికి చెబుతున్నాం.. అరెస్టు చేసి కేసులు పెట్టి ఆయన భూమి ఆయనకు అప్పగించాలి. ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుబంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వాస్తవాలు తెలిసేలా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన సమస్యల మీద లేఖ రాశారు సంతోషం.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో 7 మండలాలు, లోయర్ సీలేరు ఏపీలో కలిపారు అని గుర్తు చేశారు.

కేసీఆర్ గారు నాడు తీవ్రంగా స్పందించి, నిరసన తెలిపారు.. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. మీ సహచరుడు మీదనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడింది. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలి.. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలి అని ఎద్దేవా చేశారు.