mt_logo

ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటానికి తమకు అండగా ఉండాలని నిరుద్యోగ అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. వారితో సమావేశమైన తర్వాత మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదు అని అన్నారు.

ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు. దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారు. వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.

ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో గ్రూప్-2 లో 2 వేల ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే గ్రూప్-3 లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని అన్నారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారు. గ్రూప్-1 కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి కేవలం 60 ఉద్యోగాలు యాడ్ చేశారు. ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

కానీ ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదు.. అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారికోసం పోరాడుతుంది. గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు గతంలో ఈ డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు అభ్యర్థులకు మేలు చేసే విధంగా గ్రూప్-1 మెయిన్స్ 1:100 పద్ధతిలో పిలవటం లేదు అని తెలిపారు.

టెట్, గ్రూప్-1 ప్రిలిమ్, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -3 ఎగ్జామ్‌లు వెంట వెంటనే ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ రాస్తారు కనుక ఎగ్జామ్ ఎగ్జామ్‌కి సరిపడేంత సమయం ఇవ్వాలి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని ఏదైనా చెప్పారో వాటిని వెంటనే రిక్రూట్ చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా జాబ్ క్యాలెండర్‌ను కూడా ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అని పేర్కొన్నారు.

లేదంటే బీఆర్ఎస్ నాయకులందరం నిరుద్యోగుల పక్షాన రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో.. వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.