mt_logo

కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం

మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పరిమితి 2 నుంచి 5 లక్షలకు పెంచిన దృష్ట్యా కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం లబ్ధిదారుల KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ల ద్వారా ఆరోగ్యశ్రీ  కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహణ చేయాలి. కోవిడ్ సమయంలో ఎక్కడ చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. 

మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఈ తరహా సేవలను MGM వరంగల్ లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 103 కు చేర్పించింది.

వ్యయప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గం పరిధిలోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి. మరింత నాణ్యంగా డయాలసిస్ సేవలు అందించేందుకు గాను ఆన్లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వెర్ వినియోగానికి అనుమతి ఇచ్చింది. బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించింది.