mt_logo

7 ఏళ్ల కాలంలో తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1.87 లక్షల కోట్ల నిధులు ఖర్చు : మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ : గత 7ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ లోని  సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లు లింగాయత్, రాహుల్ శర్మ, శిక్షణ అధికారి అమిత్ నారాయణ, డీఈఓ రేణుకాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్  కుమార్ గౌడ్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తదితరుల తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వ శిక్ష అభియాన్ ద్వారా 192 మంది దివ్యాంగ విద్యార్థులకు 5 లక్షల 50 వేల నిధులతో  278 ఉపకరణాలను  మంత్రి మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు.

ఉపాధ్యాయులందరికీ  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, గౌరవనీయమైందన్నారు. కనిపించే దైవంగా ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని పేర్కొంటూ.. గత తొమ్మిది ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని వెల్లడించారు.

తెలంగాణలో 6000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 

అన్ని వర్గాల విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను స్థాపించామని తెలిపారు. వీటిలో ఇప్పటికే  12 వేల పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. రాష్ట్రంలో త్వరలో 6000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు సహకరించాలని అన్నారు.