mt_logo

స్వరాష్ట్రంలో ఆరోగ్య విప్లవం.. విస్తృతంగా వైద్య సేవల విస్తరణ

• ప్రస్తుతం తెలంగాణలో మెడికల్ కాలేజీలు – 56
• ప్రభుత్వ రంగంలో 29 కొత్త మెడికల్ కళాశాలలు
• ఎంబీబీఎస్ సీట్లు 2850 నుంచి 8515 కి పెంపు
• 22,455 వైద్య పోస్టుల భర్తీ

హైదరాబాద్, ఆగస్టు 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ /గా అవతరించింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య, విద్యా రంగంలో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం శిశువులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మొదలైన వారి అవసరాలను తీర్చేందుకు సమర్థవంతమైన కార్యాచరణను కొనసాగిస్తున్నది.

బస్తీ దవాఖానాలు:-
పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఉద్దేశించినది, ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రాంతంలో 350 బస్తీ దవాఖానాలు సేవలు అందిస్తున్నాయి. ఒక బస్తీ దవాఖానా 5,000-10,000 జనాభాకు సేవలను అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో మొత్తం 434 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. డాక్టర్ పర్యవేక్షణలో ఇక్కడ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తారు. బస్తీ దవాఖానాల్లో 2022 డిసెంబర్ వరకు 2,11,23,408 మంది చికిత్స చేసుకున్నారు. బస్తీ దవాఖానల పై ప్రభుత్వం రూ.94.87 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

తెలంగాణ డయాగ్నస్టిక్స్:-
తెలంగాణ డయాగ్నస్టిక్స్ లో 11 కోట్ల పైగా ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లు సేవలందిస్తున్నాయి. వీటిలో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఈ డయాగ్నస్టిక్ హబ్‌లతో కలిసి పని చేస్తాయి. ఆటో అనలైజర్‌లు, డిజిటల్ ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్ మెషీన్‌లు, 2-డి ఎకో, మామోగ్రామ్, హై ఎండ్ డయాగ్నస్టిక్ పరికరాలు ఈ హబ్‌లో అందుబాటులో ఉంటాయి. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహిస్తారు.

ఆరోగ్యశ్రీ:-
“ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన – ఆరోగ్యశ్రీ” పథకాలను 18 మే 2021న విలీనం చేశారు. ఈ పథకాల విలీనంతో ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట కవరేజీ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయడం కొనసాగుతుంది. మే 2023 వరకు 16 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ. 7 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఎంప్లాయి అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం :-
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ నగదు రహిత చికిత్స అందిస్తున్నారు. ఔట్-పేషెంట్ చికిత్సలు వెల్ నెస్ సెంటర్ల ద్వారా, ఇన్-పేషెంట్ చికిత్స ఎంపానెల్డ్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు. ఈ పథకం కింద 344 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు ఉన్నాయి , వీటిలో 12,04,654 మంది నమోదు చేసుకున్నారు. మే 2023 వరకు 3,65,200 మంది చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1475.19 ఖర్చు చేసింది.

ఉచిత డయాలసిస్ కార్యక్రమం:-
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. దేశంలో తొలిసారిగా సింగిల్ యూజ్ డయలైజర్ , ట్యూబ్‌లను వినియోగిస్తున్నారు. 2022 వరకు 67,049 మంది రోగులకు డయాలసిస్ కోసం ప్రభుత్వం రూ.698.08 కోట్లు ఖర్చు చేసింది.

అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు (108 సేవలు):-
108 అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితులలో రోజూ ప్రమాదాలబారిన పడిన అనేక మందిని ఆసుపత్రులకు చేరవేస్తూ, ప్రాణాలను కాపాడుతున్నాయి. ప్రస్తుతం 455 108 అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. 102 వాహనాలు 300 పనిచేస్తున్నాయి, కొత్తగా 33 నియోనాటల్ అంబులెన్స్ లు ప్రభుత్వం ప్రారంభించింది. గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile) క్రింద 100 అంబులెన్స్‌ లు విరాళంగా స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 2023 వరకు 43,94,413 మందికి సేవలు అందించి, రూ.632.17 కోట్లు ఖర్చు చేసింది.

మెడికల్ కళాశాలలు:-
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి (ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్). 9 ఏండ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది.

ఎంబీబీఎస్ సీట్లు:-
ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 3915 ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు 28 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4600 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా 8515 ఎంబిబిఎస్ సీట్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.

పీజీ మెడికల్ సీట్లు:-
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పిజి సీట్ల సంఖ్య 1240 ఉండగా, ప్రైవేటు మెడికల్ పీజీ కళాశాలల్లో 1476 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 2890 పీజీ మెడికల్ సీట్లు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి.

సూపర్ స్పెషాలిటి సీట్లు:-
ప్రభుత్వ కళాశాలల్లో 179 సీట్లు, ప్రైవేట్ లో 27 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 206 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నిమ్స్ హాస్పిటల్ విస్తరణ, అభివృద్ధి:-
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్‌) దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్నందున దానిని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. నిమ్స్‌ విస్తరణకు రూ.1,571 కోట్లతో నిర్మించే అదునాతన భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిమ్స్‌ దవాఖానలో 1,800 పడకలు అందుబాటులో ఉన్నాయి. దానికి అనుబంధంగా కొత్తగా నిర్మించనున్న భవనంలో మరో 2,000 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిమ్స్ లో మొత్తం పడకల సంఖ్య 3,800కు పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటుచేయనున్న బెడ్స్‌లో 500 పడకలను ఐసీయూకు కేటాయిస్తారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్యాన్సర్‌, అత్యవసర వైద్యసేవల విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్‌ తదితర 42 స్పెషాలిటీస్‌ సేవలు కొత్త భవనంలో అందుబాటులోకి రానున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ నర్సింగ్‌, అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌ విభాగాల్లో సైతం శిక్షణ కోర్సులను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా నిర్మించనున్న 4 టిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ దవాఖానల్లో 4,000 పడకలు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో 2,000 పడకలు, నిమ్స్‌ లో 2,000 పడకలు అదనంగా సమకూరుతున్నాయి.

పల్లె దవాఖానాలు:-
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం మాత్రమే ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో సైతం దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఒక్కో పల్లె దవాఖానకు రూ. 20 లక్షల వ్యయంతో పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ పథకం’ కింద రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నది. ప్రతి భవనంలో డాక్టర్ రూంతో పాటు మూడు బెడ్లతో కూడిన వార్డు రూం, ఒక వెయిటింగ్‌ హాల్‌, స్టోరేజీ గది, ఒక నర్సింగ్‌ గది, ల్యాబ్‌, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రోగులను వీల్‌చైర్‌లో తరలించేందుకు ర్యాంప్‌ కూడా ఉంటుంది. 3206 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి 1 కోటి 36 లక్షల మందికి వైద్య సేవలు అందించింది.

కంటి వెలుగు:-
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అని ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసకబారిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారి కష్టాలు తీర్చడం కోసం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది. తొలిదశ విజయం స్ఫూర్తితో రెండో దశ కంటి వెలుగు నేత్ర వైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది.

కంటిచూపు సమస్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందించారు. కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కొందరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పథకాన్ని ప్రశంసించి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తామని ప్రకటించారు.

15 ఆగస్టు 2018 లో కంటి వెలుగు మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

18 జనవరి 2023 న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి చేతుల మీదుగా ఖమ్మంలో ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తమ తమ రాష్ట్రాల్లోనూ కంటివెలుగును అమలు చేస్తామని ప్రకటించారు. రెండో విడతలో భాగంగా 100 పనిదినాల్లో కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 40.59 లక్షల మందికి దృష్టి లోపం ఉన్నట్టు గుర్తించారు.

పాలియేటివ్ కేర్:-
మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషెంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. అవసాన దశలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి. రాష్ట్రంలో 33 సంరక్షణ, సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో ఐదో వంతు తెలంగాణలోనే ఉన్నాయి.

హైదరాబాద్ లో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం:-
రాష్ట్ర ప్రభుత్వం మొదట గచ్చిబౌలిలో ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’ ను ఏర్పర్చింది. కరోనా వ్యాపించినప్పటి నుండి హాస్పిటల్ సేవలు అందిస్తున్నది. అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల ఖర్చుతో, గడ్డి అన్నారం లో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్ల ఖర్చుతో, ఎర్రగడ్డ లో రూ.882 కోట్ల ఖర్చుతో ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మిస్తున్నారు. తదనంతరం 26 ఏప్రిల్ 2022న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మూడు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. టిమ్స్ లో ఏయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలుగా సేవలందిస్తాయి. ఇందులో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ లో పీజీ కోర్సులు, సూపర్ స్పెషాలిటీలలో నర్సింగ్, పారామెడికల్ విద్య, 30 విభాగాలు గుండె, కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరితిత్తుల విభాగాలు, క్యాన్సర్ సేవలు, ట్రామా సేవలు, ఎండోక్రైనాలజీ విభాగాలు, ఎలర్జీ, రుమటాలజీ విభాగాలు, వ్యాధి నిర్ధారణ విభాగాలు, 200 మంది ఫాకల్టీ, 500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు, 26 ఆపరేషన్ థియేటర్స్, గుండె క్యాత్ ల్యాబ్ సేవలు, కిడ్నీ డయాలసిస్ సేవలు, క్యాన్సర్ రేడియేషన్ & కీమోథెరపీ సేవలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు, 1,000 పడకలకు ఆక్సిజన్, వీటిలో 300 ఐసీయూ పడకలు, ఫాకల్టీ, రెసిడెంట్లకు క్వార్టర్స్ ఉంటాయి.

వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్:-
వరంగల్ లో అత్యాధునిక సౌకర్యాలతో రూ. 1200 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూన్ 2021 భూమి పూజ చేశారు. 59 ఎకరాల్లో ఈ హాస్పిటల్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 24 అంతస్తులతో రూపుదిద్దుకున్న ఈ భవనంలో 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తారు.

ఆర్టీ పీసీఆర్ లాబొరేటరీలు:-
ప్రస్తుతం రాష్ట్రంలో 27 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. కరోనా కంటే ముందు రాష్ట్రంలో ఆర్టీ పీసీఆర్ ల్యాబ్ కేవలం ఒకటి మాత్రమే ఉండేది. నిమ్స్ లో ఏర్పాటు చేసిన COBAS 8800 మెషిన్ రోజుకు 4000 కరోనా పరీక్షలు చేస్తుంది. మరో 8 ఆర్టిపిసిఆర్ ల్యాబ్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక్క ఆర్టిపిసిఆర్ ల్యాబ్ అయినా సేవలందించే అవకాశం ఏర్పడింది.

22,455 వైద్య పోస్టుల భర్తీ:-
ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం 22,455 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో డాక్టర్ , నర్సింగ్ , పారామెడికల్ , ఏ.ఎన్.యం. పోస్టులు ఉన్నాయి. కొత్తగా మరో 26,978 పోస్టులు మంజూరు చేశారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.