
మహాత్మా గాంధీ 154 వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రనికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కుల వృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలుగా నిలిచాయని సీఎం అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.