
బీసీ, చేతివృత్తులవారికి ఇచ్చినట్టే మైనార్టీలకు లక్షసాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 23న తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. లక్ష సాయానికి సంబంధించిన అర్హతలు, విధివిధానాలు కూడా వెల్లడించింది. తాజాగా, అధికారులు లక్ష సాయానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 31 (సోమవారం) నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో www.tsobmms.gov.in, https://tsobmm sbc.cgg.gov.in వెబ్సైట్లో సమర్పించాలి. ఇతర వివరాల కోసం.. జిల్లా మైనారిటీ అధికారిని గానీ.. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయంలో లేదా 040-23391067 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ఎవరు అర్హులు?
-ముస్లిం, క్రిస్టియన్లకు.. ఆయా కమ్యూనిటీల కార్పోరేషన్ నిధుల నుంచి సర్కారు ఆర్థిక సాయం అందిస్తుంది.
-ఈ పథకానికి 21 నుంచి 55 ఏండ్లున్న వయసున్న మైనార్టీలు అర్హులు.
-గ్రామీణ ప్రాంతం వాళ్లు లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతం వాళ్లు రెండు లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి.
-అర్హులను గుర్తించి, బీసీ బంధు మాదిరిగానే.. వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు ఇస్తారు.