mt_logo

అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త 

  • సీఎం కేసీఆర్ రాష్టంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీర్త 
  • అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు
  • ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.1,00,000, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000
  • 50 ఏళ్ల లోపు ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏళ్లు దాటిన వారికి 2 లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా
  • అంగన్‌వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సరళీకృతం 
  • దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ. 20 వేలు, హెల్పర్లుకు రూ. 10 వేల సాయం
  • అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు
  • అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాల పెంపు

తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.1,00,000/- రూపాయల లు, మరియు మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్  సౌకర్యం, 50 ఏండ్లు దాటిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కల్పించారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లకు 10 వేలు సాయం అందిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లకు 10 వేలు సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 14వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నామన్నారు.  అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్  మంజూరు ఇస్తూ నేడు జీవో జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. కోవిడ్ సమయంలో  అంగన్‌వాడీల సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందజేసిందని గుర్తు చేశారు. అంగన్వాడీలు సమ్మె విరమింప చేయాలని కోరారు. అంగన్‌వాడీలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చమని అన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంగన్వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సింప్లిఫై చేస్తామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమే అని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.  ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు.  గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని మంత్రి అన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 115 కోట్ల భారం భరిస్తుందని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల మంది అంగన్‌వాడీలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లి తండ్రి వలె ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని గుర్తు చేశారు. మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్‌ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అంగన్‌వాడీల టీచర్లు హెల్పర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.