mt_logo

యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి. ఈసారి పండుగ పండుగ మాదిరిగా లేకుండా పోయింది అని విచారం వ్యక్తం చేశారు

రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు..వరంగల్‌లో ఓ ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళితే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని వాళ్లను తరమికొట్టారంట. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. యూపీలో అక్కడ సీఎం బుల్డోజర్ రాజ్‌ను నడిపిస్తున్నాడని మనం గతంలో అనుకున్నాం. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పడు అలాంటి బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారు అని దుయ్యబట్టారు.

ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న ఆఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని తలచుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పది నెలల వాళ్ల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి అని పేర్కొన్నారు.

డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్‌డే రోజునే రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు..కేసీఆర్ జాబ్ పొగొట్టండి.. మీకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి నా గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదు అని విమర్శించారు.

మహిళలకు రూ. 2,500 ఇస్తా అన్నాడు. కోటి 60 లక్షల మంది మహిళలు రూ. 2,500ల కోసం వేచి చూస్తున్నారు. వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? ఉన్న రైతు బంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదు. వాళ్లు 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైనయ్ అంటే సమాధానం చెబుతలేడు అని అన్నారు.

కళ్యాణలక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం ఇనుము కూడా ఇవ్వడు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని అడిగితే పైసలు లేవంట. కానీ మూసీ కోసం మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట. సంక్షేమ పథకాల కోసం పైసలు ఇస్తే మీరు కమీషన్‌లు ఇవ్వరు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చు. మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటది మనం ఏదైనా సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పాలంట. ఇంటింటికి ఓట్ల కోసం వచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట అని అన్నారు.

ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలే. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను పట్టుకొని మనం అడగాలె. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మోసం చేశారు. హర్యానాలో ఏడు గ్యారంటీలంటూ మోసం చేయబోయరు. కానీ కాంగ్రెస్ మోసాలను గుర్తుపట్టి వాళ్లు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బుద్ది తెచ్చుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేదంటే మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పటం ఖాయం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పుడు కేసీఆర్ గారు లేరన్న బాధలో ఉన్నారు. పేదల కోసం కేసీఆర్ గారు వాళ్లకు అవసరమైన సమయంలో అన్ని చేశారు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అని భరోసానిచ్చారు.

సెక్యులరిజాన్ని కొనసాగిస్తాం.. మనిషి మనిషిగా చూస్తూ భవిష్యత్‌లోనూ అదే తరహా రాజకీయం చేస్తాం. మోడీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించాడు. మా చెల్లెలిని జైల్లో పెట్టారు. అయిన సరే మేము తలవంచలేదు. మోడీతోనే పోరాటం చేశాం. అదే పోరాటస్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు.

పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్రమంగా భూములు గుంజుకోవద్దంటూ మన పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేస్తే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడ రైతుల మీద లాఠీఛార్జి చేశారు అని అన్నారు.

ముఖ్యమంత్రి.. నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజలను ఒప్పించకపోతే రాష్ట్రాన్ని ఎట్ల నడిపిస్తావ్? ప్రజల భయాలను, అనుమానాలను నివృత్తి చేసి వాళ్లను ఒప్పించాలి. ఎన్నో రోజులు పోలీసులను పెట్టుకొని ఇలాంటి అరాచకాలు మీరు జరపలేరు అని కేటీఆర్ హెచ్చరించారు.

ప్రజాభిప్రాయం మేరకే వాళ్లను ఒప్పించి, మెప్పించి ఏ పరిశ్రమ అయిన పెట్టాలి. మా పార్టీ నేత నరేందర్ రెడ్డితో సహా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.