mt_logo

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్

ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ చర్చించింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉంది.

ఈ నేపథ్యంలో.. హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకొని.. దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.